హిందూ పురాణాలకు మూలాలు సంస్కృతంలో రాయబడిన కొన్ని గ్రంథాలు. వీటిని పలు రకాలుగా వర్గీకరించవచ్చు. వీటిలో ఒక సరళమైన వర్గీకరణ ఒకటి చూద్దాం.
అన్నింటికన్నా ప్రాచీనమైనవి వేదాలు. వేదం అనే పదం విద్ అనే సంస్కృత పదం నుంచి ఉద్భవించింది. ఈ పదానికి అర్థం తెలుసుకోవడం అని. ఈ వేదాలు హిందువులకు ప్రాథమిక భావనలు. సృష్టికర్తయైన బ్రహ్మ ఈ జ్ఞానాన్ని సప్తర్షులకు బోధించాడు. వాళ్ళు దాన్ని వ్యాప్తి చేశారు.
వేదాలను నాలుగు భాగాలుగా విభజించారు. అవి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. ఉపనిషత్తులు వీటిలో చాలా ముఖ్యమైన అంశాలు. వీటిని వేదాల సంగ్రహం గా పేర్కొనవచ్చు. వీటిని ఆధారంగా చేసే బోధనలను వేదాంత శాస్త్రం అంటారు.
తర్వాతి గ్రంథాలు బ్రాహ్మణాలు. ఇవి పూజారులు అనుసరించవలసిన యజ్ఞయాగాదులు గురించి తెలియ జేస్తాయి. వీటిలో కూడా పురాణాల గురించి ప్రస్తావన ఉంటుంది.
ఇక ఇతిహాసాలు, పురాణాల్లో చారిత్రాత్మక కథలు చాలా ఉంటాయి. రామాయణం, మహాభారతం, యోగవశిష్టం, హరివంశం ఇతిహాసాలకిందకు వస్తాయి. ఇవి చారిత్రక సత్యాలను నీతికథలు, సంభాషణలు మొదలైన వాటి ద్వారా తెలియబరుస్తాయి. ఇవి వేదాలలోని వాదనలను, తర్కాన్ని అవగాహన చేసుకోని సామాన్య మానవునికోసం సృష్టించబడ్డాయి.